*ఫ్యాక్షన్ తరహాలో బత్తాయి తోట ఫెన్సింగ్ రాళ్ళు ధ్వంసం* ఉదయగిరి, సెప్టెంబర్ 6 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఫ్యాక్షన్ తరహాలో తోటల విధ్వంసం, శిలా ఫలకాలు ధ్వంసం లాంటి సంఘటనలు ఇటీవల ఉదయగిరి ప్రాంతంలో పెచ్చురిల్లుతున్నాయి. ఈ విష సంస్కృతులు ఎటు దారి తీస్తాయనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. వివరాలలోకి వెళితే తాజాగా నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం క్రిష్ణగాంధీపురం గ్రామంలో కొండూరు. సుబ్బమ్మ అనే మహిళా రైతుకు చెందిన బత్తాయి తోట చుట్టూ వేసి ఉన్న 41 ఫెన్సింగ్ రాళ్ళును అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రైతు కొండూరు. సుబ్బమ్మ దంపతులు బెంగుళూరుకు వెళ్ళి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఈ నెల 3 వ తేదీ రాత్రి బత్తాయి తోటకు రక్షణగా వేసిన ఫెన్సింగ్ రాళ్ళును గుర్తు తెలియని వ్యక్తులు విరగ్గొట్టారని అన్నారు. 4 వ తేదీ ఉదయం యధావిధిగా తమ తోటలోకి పశువుల గడ్డి కోసుకునేందుకు వెళ్ళిన కొంతమంది గ్రామస్థులు బెంగుళూరులో ఉన్న తమకు తోటలో జరిగిన విధ్వంసం గురించి తెలియజేశారన్నారు. వెంటనే హుటాహుటిన తాము స్వగ్రామానికి చేరుకుని తోటను పరిశీలించి మనోవ్యధకు గురయ్యామని సుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విష సంస్కృతులు మంచి పద్దతి కాదని ఆమె ఈ దుశ్చర్యలకు పాల్బడిన వారికి హితువు పలికారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తోటలో ఫెన్సింగ్ రాళ్ళు ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించి భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.