వైసీపీలోకి తోట.. చేరిక అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు జంపింగ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి కీలకంగా ఉన్న నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆ పార్టీకి గుడ్ చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తోటకు వైసీపీ కండువా కప్పిన జగన్ సాదరంగా ఆహ్వానించారు. చేరిక అనంతరం తోట మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరిన తాను ఈ రోజు నుంచి జగన్ నేతృత్వంలో కార్యకర్తగా పనిచేస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనపై ఉన్న నమ్మకంతో తాను వైసీపీలోకి వచ్చానని తోట ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మున్ముందు ఎంతమంది పార్టీలోకి వస్తారో మీరే చూస్తారని మీడియా ముఖంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోట చేసిన వ్యాఖ్యలు టీడీపీ, ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
భయపడాల్సిన అవసరం లేదు : 'రాష్ట్ర భవిష్యత్తు కోసం సమర్ధవంతమైన పాలన అందిస్తారనే ప్రజలు జగన్ను సీఎం చేశారు. రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, వేణుగోపాల్లకు ప్రత్యర్థిగా పోటీ చేశాను. గెలుపోటములు ఎలా ఉన్నా... ఇప్పుడు అందరం కలిసి ఒకే పార్టీలో ఉండి ప్రజల కోసం పని చేస్తాం.కులాల మధ్య వైరం మా దగ్గర లేదు.. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక్క కులంతో రాజకీయం చేయడం ఎప్పుడూ సాధ్యం కాదు. జగన్ వంద రోజుల పాలన పై ప్రతిపక్షం విమర్శలు చేయడం తప్ప.. ఇంకేమీ చేయలేరు. కాపులు జగన్కు భయపడి వైసీపీలోకి వెళతున్నారనేది పవన్ వ్యక్తిగత అభిప్రాయం. నాకు తెలిసి అంత భయపడాల్సిన అవసరం కాపు నేతలకు లేదు' అని తోట తేల్చిచెప్పారు.
వైసీపీలోకి తోట.. చేరిక అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు