వైసీపీ నేతల ఇసుక అక్రమాలను నిరూపిస్తా..

తేది 02-11-2019

వైసీపీ నేతల ఇసుక అక్రమాలను నిరూపిస్తా..
మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామాకు సిద్ధమా.?
                                - మంతెన సత్యనారాయణ రాజు
    తెలుగుదేశం పేరు వింటేనే మంత్రి అవంతి శ్రీనివాస్‌కు నిద్ర కరువవుతోంది.  వైసీపీ నేతల ఇసుక అక్రమాలను పత్రికా ముఖంగా నిరూపిస్తా. మీడియా ముందు రాజీనామా సవాల్‌ విసిరిన మంత్రి అవంతికి.. వాస్తవ పరిస్థితులపై చర్చించే ధైర్యం ఉందా.? నాలుగు గోడల మధ్య కాదు. మీ సొంత జిల్లా విశాఖలో ఇసుక కొరతతో నిలిచిపోయిన వందలాది భవనాలు మీకు కనిపించడం లేదా.? చెన్నై, బెంగళూరు, చెన్నైకి లారీ రూ.లక్ష చొప్పున తరలిస్తున్న విషయం మీకు తెలియదా.? ప్రజాక్షేత్రంలోకి రండి. బయటకొచ్చి ఇసుకతో ప్రజలు పడుతున్న కష్టాలు చూడండి. ఎనిమిది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక కుటుంబాలను పస్తులుంచలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనికి వైసీపీ ఇసుక మాఫియా కారణం కాదా.? కడప జిల్లా సిద్ధవటం మండలంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిని వైసీపీ నేతలు ట్రాక్టర్‌తో ఢీకొట్టించారు. ఘటనలో వీఆర్‌ఓ ఆరిఫ్‌, వీఆర్‌ఏ వెంకటపతి గాయపడడం నిజం కాదా.? నిన్నటికి నిన్న కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తొట్లవల్లూరులోని గరికపర్రు గ్రామ వాలంటీర్‌ అర్ధరాత్రి వేళ రూ.1500 నుండి రూ.2వేలు వసూలు చేసి ఎడ్ల బండిలో ఇసుక తరలిస్తుంటే గ్రామస్థులు అడ్డుకోగా స్థానిక నేత పేరు చెప్పి బెదిరించడం వాస్తవం కాదా.? వీటన్నింటిపై మంత్రి అవంతి చర్చకు సిద్ధమైతే.. ప్లేస్‌ చెప్పండి. అక్రమాలు జరగలేదని చెప్పే ధైర్యం ఉంటే రాజీనామా లేఖతో చర్చకు రండి.
                                    Sd/-
                                మంతెన సత్యనారాయణ రాజు
                                శాసన మండలి సభ్యులు