ఏడాదిలోగా ఏపీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం : మంత్రి మేకపాటి

న్యూ ఢిల్లీ :
*మౌలిక వసతుల కల్పన రంగంలో ఏడాదిలోగా ఏపీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
• గత ప్రభుత్వం మంగళగిరిలో ఐటీని ప్రోత్సహించాలని ప్రయత్నించి విఫలమైంది
• విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి కృషి చేస్తాం
• సులభతర మౌలిక వసతుల కల్సన రంగంలో రాష్ట్రాల ర్యాంకులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
• మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్
• కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా  అవార్డు అందుకున్న ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
• ప్రతి 3 నెలలకోసారి అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించాలని కోరిన మంత్రి
• ఆక్వా రంగానికి సంబంధించిన సర్టిఫికేషన్ ల్యాబ్ లను  విశాఖపట్నం లేదా కాకినాడలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి


అమరావతి ,సెప్టెంబర్, 12 ;    మౌలిక వసతుల కల్పన రంగంలో ఏడాదిలోగా రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం  విదేశీ వాణిజ్యంపై 'బోర్డ్ ఆఫ్ ట్రేడ్' పేరుతో సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్,  అన్ని రాష్ట్రాల పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రులు, ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన  ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరపున మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వం అనువుకాని ప్రాంతమైన మంగళగిరిలో ఐటీని ప్రోత్సహించాలని ప్రయత్నించి విఫలమైందని మంత్రి ఆరోపించారు. తద్వారా రాష్ట్రానికి రావాల్సిన ఐటీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయన్నారు. గత ప్రభుత్వం విధానాలను ప్రక్షాళన చేసి విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి కృషి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి మేకపాటి.  రాష్ట్రంలోని కీలకమైన ఐదు రంగాల్లో కేంద్రం ప్రభుత్వం నుంచి సహకారం కోరుతున్నామని మంత్రి మేకపాటి వ్యాఖ్యానించారు. 


పరిశ్రమలలో జీఎస్టీ  పన్నుల విషయంలో రాష్ట్రాలు రాయితీలు కోరుతున్నాయన్నారు. దీనిపై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే జరిగితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎలక్ట్రానిక్స్, సెల్‌ఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లలో 4 నుంచి 5 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. పత్తి సేకరణకే ఉత్పత్తి కన్నా ఎక్కువ ఖర్చు అవుతోందని, అందువల్ల ల్ల టెక్స్ట్‌టైల్స్ మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.  అదే విధంగా రాష్ట్రంలో ఆక్వా ఎగుమతుల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని మంత్రి వివరించారు. నాణ్యతా ప్రమాణాల ధృవీకరించేందుకు రాష్ట్రంలో ప్రయోగశాలలు లేవన్నారు. దీని వల్ల ఆక్వా ఉత్పత్తులను అనుకున్నంత స్థాయిలో ఎగుమతి చేయడం సాధ్యపడడం లేదని మంత్రి తెలిపారు.  విశాఖపట్నం లేదా కాకినాడలో సర్టిఫికేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సమావేశంలో  మంత్రి ప్రభుత్వ అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతి 3 నెలలకోసారి అన్ని రాష్ట్రాలతో వర్తకం, ఎగుమతులపై సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా రంగాలలో ఏవైనా ఇబ్బందులుంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సులభంగా ఉంటుందని మంత్రి తెలిపారు. మెరైన్, సీ పాలసీ రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వేటకు వెళ్లలేని పరిస్థితుల్లో మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తోందని, ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకారమందిస్తే బాగుంటుందని మంత్రి అన్నారు.  ఇక చేపల వేట విషయంలో ఎకనామిక్ జోన్ దాటి వెళ్లాలంటే పెద్ద పెద్ద ట్రాలీలు అవసరమని. ఆ సదుపాయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించాలన్నారు.ప్రస్తుతం ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడిన పరిస్థితులలోనూ భారతదేశం అవకాశాలను సృష్టించుకోగలదని మంత్రి అన్నారు.  అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం వల్ల పరిశ్రమలు ఇతర దేశాలకు తరలి వెళ్తున్నాయని , ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులున్నాయన్నారు మంత్రి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో విదేశీ వర్తకంపై అన్ని రాష్ట్రాలతో  కేంద్రం నిర్వహించిన ట్రేడ్ బోర్డ్ మీటింగ్ లో సులభతర లాజిస్టిక్స్ లో రాష్ట్రాల ర్యాంకులను కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా  ఆంధ్రప్రదేశ్  3వ స్థానంలో నిలిచింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా  ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అవార్డును అందుకున్నారు.