పీఎస్‌ఎల్‌వీ సీ47 వాహకనౌక నింగిలోకి

శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ సీ47 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ఉదయం 9.28 గంటలకు చేపట్టారు. అనంతరం 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ47 ప్రయోగానికి మంగళవారం ఉదయం 7.28 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈ ప్రక్రియ 26 గంటలపాటు సాగింది. 
చంద్రయాన్‌-2 తర్వాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగమిది. ఈ ప్రయోగం ద్వారా కార్టోశాట్‌-3తోపాటు  అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపనున్నారు. మూడోతరం హైరెజల్యూషన్‌ ఎర్త్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం కార్టోశాట్‌-3. దీని జీవిత కాలం ఐదేళ్లు.. బరువు సుమారు 1625 కిలోలు. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించిన సేవలను ఇది అందించనుంది. ఉగ్రవాద శిబిరాలను కార్టోశాట్‌-3 మరింత స్పష్టంగా తీయనుంది.