పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

 


అమరావతి
తేది : 19.11.2019.


పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక


• బోటు ప్రమాదాల నివారణకు మూడు దశల్లో పర్యవేక్షణ


• పర్యాటక బోట్ల లైసెన్స్‌ లపై దృష్టిసారించిన పర్యాటక శాఖ


• పర్యాటకుల భద్రత, రాష్ట్రానికి ఆదాయం పెంచడమే లక్ష్యం


• నవంబర్ 21వ తేదీన  కంట్రోల్ రూంల ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన
   : రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు


అమరావతి, 19 నవంబర్: బోటు ప్రమాదాల నివారణకు, పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ అధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బోటు యజమానులు, ఆయా శాఖల  అధికారుల  సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. 


 రాష్ట్రంలోని పర్యాటక బోట్లన్నీ మళ్లీ కొత్త లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందేనని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 బోట్లున్నాయని అందులో ఏపీ టీడీసీ ఆధీనంలో 54 బోట్లు,  కాకినాడ డివిజన్ లో 161, మచిలీపట్నం డివిజన్ లో 149 పైగా ప్రైవేటు బోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కాకినాడ డివిజన్ లో 85 బోట్లు, మచిలీపట్నం డివిజన్ లో 97 బోట్లకు తనిఖీలు పూర్తిచేశామని తెలిపారు. మిగిలిన వాటికి తనిఖీ త్వరలోనే పూర్తిచేస్తామన్నారు.  బోట్ ఫిట్ నెస్ తో పాటు నదులు, జలవనరుల్లో రూట్ సర్వే, సరంగు(బోటు డ్రైవర్) డ్రైవింగ్ శిక్షణ లాంటి మూడు అంశాలను తప్పనిసరి చేశామని మంత్రి వెల్లడించారు. బోటు నడిపేవారు ఎవరయినా అన్ని నిబంధనలను పాటిస్తామని లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి హామీ ఇస్తేనే బోట్లు తిప్పడానికి అవకాశం ఇస్తామని వెల్లడించారు.  బోటు ఫిట్నెస్, రూట్ అనుమతులు, సరంగు కు డ్రైవింగ్ లైసెన్సు ఉంటేనే అనుమతులు వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సగానికి పైగా బోట్లను తనిఖీ చేశామని స్పష్టం చేశారు. పోర్టు అథారిటీ నుంచి అనుమతులు వచ్చాకే బోట్లను నదులు, జలవనరుల్లో పర్యాటకానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. సరంగులకు 18 రోజుల పాటు శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉత్తీర్ణులు అయ్యాకే లైసెన్సులు జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. డిసెంబర్ 10వ తేదీన కాకినాడ లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. డిసెంబర్‌ 15 నాటికి అన్ని సిద్ధం చేసి బోటు ఆపరేషన్‌ ప్రారంభిస్తామని, ప్రతి బోటు ఆపరేటర్‌ కొత్తగా లైసెన్సుకి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సీనియర్‌ సారంగులైనా పరీక్ష రాయాల్సిందేనని స్పష్టం చేశారు. బోట్ల విషయంలో  అందరూ నిబంధనలు పాటించాల్సిందేనని  హితవు పలికారు. గతంలో జరిగిన తప్పులను గుణపాఠంగా తీసుకొని  సరిదిద్దుకుంటామన్నారు.  ప్రతి బోటుకు ఇన్సూరెన్స్ తప్పనిసరన్నారు. అదే విధంగా ప్రతి బోటు యజమాని పర్యాటకుల భద్రతకు తొలి ప్రాధాన్యమివ్వాలన్నారు. బోటు డ్రైవర్లకు భౌతికంగా, మానసింగా ధృడత్వం ఉండాలని, అలాంటి వారికి అవకాశం కల్పిస్తామన్నారు. పర్యాటక పరంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నవంబర్ 26వ తేదీన ఉభయగోదావరి జిల్లాల కేంద్రంగా రాజమండ్రిలో ఇన్వెస్టర్ మీట్ ఉంటుందని తెలిపారు. అనంతరం తిరుపతి కేంద్రంగా మరో సమావేశం నిర్వహిస్తామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ బోట్ల నిర్వహణకు సంబంధించి 9 కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి ఐఏఎస్ ల కమిటీ సూచించిందని మంత్రి తెలిపారు. ఈ నవంబర్ 21వ తేదీన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఈ కంట్రోల్ రూమ్ ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రధానంగా విశాఖపట్నంలో రిషికొండ వద్ద, తూర్పుగోదావరి జిల్లాలోని గండిపోచమ్మ, పోచవరం, రాజమండ్రి పద్మావతి ఘాట్ లోనూ, పశ్చిమగోదావరి జిల్లాలోని సింగనపల్లి, పేరంటాలపల్లిలోనూ,  కృష్ణా జిల్లాలో విజయవాడలోని బెరంపార్కు వద్ద, గుంటూరు జిల్లాలో నాగార్జునసాగర్ వద్ద, కర్నూలు జిల్లాలో శ్రీశైలం వద్ద ఈ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మూడు నెలల్లో వీటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ఎమ్మార్వో స్థాయి అధికారి నేతృత్వంలో పర్యాటక, పోలీసు, విపత్తు నిర్వహణ శాఖ, జలవనరుల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో కూడిన బృందం ఈ కంట్రోల్ రూముల్లో విధులు నిర్వహిస్తారని మంత్రి వివరించారు.  కంట్రోల్ రూమ్స్ నిరంతరం బోట్లను పర్యవేక్షిస్తుంటాయని తెలిపారు. 


ఇంగ్లీష్‌ మీడియం విద్యపై మతపరమైన విమర్శలు చేయడం దారుణమని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్న ఇంగ్లీష్‌ మాధ్యమానికి, క్రిస్టియన్‌ మతానికి ఏం సంబంధం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీన, నిమ్న వర్గాల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఇంగ్లీష్‌ మీడియం విద్య అందించడం తప్పా అని ప్రశ్నించారు. గతంలో కుల రాజకీయాలు చేసిన ప్రతిపక్షం ఇప్పుడు మతానికి సంబంధించి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.  డయాబెటిస్ ఉండటం వల్ల  మాలలో చెప్పులు ధరించానని తనకు దైవభక్తి మెండుగా ఉందని మంత్రి చెప్పారు.  టీడీపీలో ఉన్నప్పుడు మాల వేసుకున్న సందర్భంలో కూడా చెప్పులు వేసుకున్నానని గుర్తుచేశారు. కానీ  అప్పుడు అవేవీ నేటి ప్రతిపక్షానికి కన్పించ లేదా అని ప్రశ్నించారు.  హిందువుగానే పుట్టా.. హిందువుగానే చనిపోనని మంత్రి చెప్పారు.  కుట్రలో భాగంగా కావాలనే ప్రతిపక్ష నేత ఈ తరహా ఆరోపణలు చేయిస్తున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. పదవులు ఇచ్చేటప్పుడు గుర్తురాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు మాత్రం ప్రతిపక్ష నేత వినియోగించుకుంటున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విమర్శలు చేసే ముందు, హద్దులు దాటి ప్రవర్తించకుండా, సహేతుకమైన విమర్శలు చేస్తే స్వాగతిస్తామని ప్రతిపక్షానికి మంత్రి సూచించారు. ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలే తప్ప అవకాశవాద రాజకీయాలు చేయడం తగదన్నారు. తమ పార్టీ అన్ని కులాల, మతాల, వర్గాల జాతి అభ్యున్నతి కోసం పని చేస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. 


కార్యక్రమంలో యువజన సంక్షేమం మరియు క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్, సంబంధిత శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.
……………