నెల్లూరు ను రెడ్ జోన్ గా కేంద్రం గుర్తించి   హాట్‌స్పాట్‌  గా ప్రకటించారు :కలెక్టర్

నెల్లూరు ను రెడ్ జోన్ గా కేంద్రం గుర్తించి   హాట్‌స్పాట్‌  గా ప్రకటించారు :కలెక్టర్
--------------------


   నెల్లూరు, ఏప్రిల్,16 (అంతిమ తీర్పు) : దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలను గుర్తించి.. ఆ జిల్లాలను కోవిడ్‌-19 హాట్‌స్పాట్‌ లుగా కేంద్రం ప్రకటించిందని..,  నెల్లూరు జిల్లా కూడా ఆ లిస్టులో ఉన్నందువల్ల.., రెడ్ జోన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ విస్తరించకుండా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్ శ్రీ యం.వి.శేషగిరి బాబు.., ఆర్డీఓలు, మున్సిపల్ కమీషనర్లకు స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్  ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సీ నుంచి గురువారం రాత్రి .. ఆర్డీఓలు, మున్సిపల్ కమీషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్.., ఏప్రిల్ 20 నుంచి కంటైన్ మెంట్ జోన్ లో తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రీన్ జోన్ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం.., పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి.., లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఉన్నాయని.., ఆర్డీఓలు, మున్సిపల్ కమీషనర్లు దీనిపై మైక్రో ప్లాన్ రెడీ చేసి, అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. డివిజన్, నియోజకవర్గ స్థాయిలో క్వారంటైన్ సెంటర్లు నోటిఫై చేయాలని.., అక్కడ ఉన్న వసతి సదుపాయాలు ఏమి ఉన్నాయో సరి చూసుకుని..., అక్కడ ఏమి అవసరమో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రులకు, పి.హెచ్.సి లకు పి.పి.ఈలు, ఎన్-95 మాస్కులు పంపించామని తెలిపారు. డివిజన్ స్థాయిలో క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు చేయడంతో పాటు.., అక్కడ ఒక్కో రూంకి ఒక్కో వ్యక్తిని మాత్రమే ఉంచే విధంగా అటాచ్డ్ బాత్రూం సౌకర్యం ఉన్న బిల్డింగ్స్ గుర్తించాలన్నారు. ఒక్కో క్వారంటైన్ సెంటర్లో 40 మందిని మాత్రమే ఉంచే విధంగా.., క్వారంటైన్ సెంటర్లను ఎంపిక చేయడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజలందరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రచారం చేయాలని కలెక్టర్ తెలిపారు.



ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్రీ డా. వి.వినోద్ కుమార్... క్వారంటైన్ సెంటర్లలో అమలు చేయాల్సిన నిబంధనలపై ఆర్డీఓ, మున్సిపల్ కమీషనర్లతో చర్చించారు. పి.పి.ఈలు, ఎన్-95 మాస్కులు ప్రాధాన్యతా క్రమంలో అన్ని డివిజన్లకు పంపిస్తామని ఆర్డీఓలకు తెలిపారు.  60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలున్న వారు, 60 ఏళ్ల కన్నా వయస్సు తక్కువగా ఉండి అనారోగ్య సమస్యలున్న వారికి ముందుగా కోవిడ్-19 టెస్టులు చేయాలని.., ఆ తర్వాత అనారోగ్య సమస్యలు లేని.. 60  ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు, అనారోగ్య సమస్యలు లేని 60 ఏళ్ల లోపు ఉన్నవారికి కోవిడ్-19 టెస్టులు చేయాలని తెలిపారు. కోవిడ్ -19 లక్షణాలు ఉన్న వారి నుంచి స్వాబ్ తీసుకునే సమయంలో పాటించాల్సిన నిబంధనలు, క్వారంటైన్ సెంటర్లలో తీసుకోవాల్సిన చర్యల గురించి పూర్తి సమాచారం ఆర్డీఓలు, మున్సిపల్ కమీషనర్లకు పంపించామని.., క్షేత్ర స్థాయిలో స్వాబ్ తీసుకునే సమయంలోనే ఆ వ్యక్తి పూర్తి సమాచారం, ఆధార్ కార్డుతో పాటు.., అన్ని వివరాలు కూడా తీసుకోవాలని.., వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న డి.ఆర్.ఓ శ్రీ మల్లిఖార్జున్ అధికారులకు తెలిపారు. ఈ విధంగా సమాచారం సేకరిస్తే.., పాజిటివ్ తేలిన వ్యక్తిని క్వారంటైన్ కి తరలించడంతో పాటు.., ప్రైమరీ, సెంకండరీ కాంటాక్టు వ్యక్తులను గుర్తించి.., కోవిడ్-19 నివారణ చర్యలను వేగవంతంగా తీసుకోవచ్చన్నారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కావలి, గూడూరు, ఆత్మకూరు, నెల్లూరు ఆర్డీఓలు, కావలి, ఆత్మకూరు, నాయుడు పేట,  మున్సిపల్ కమీషనర్లు, నుడా ఛైర్మన్ శ్రీ బాపిరెడ్డి, నోడల్ అధికారి డా. రాజేంద్రప్రసాద్, డి.ఎం.అండ్ హెచ్.ఓ, డి.పి.ఓ, అధికారులు పాల్గొన్నారు.