ధరల నియంత్రణ దిశగా తహసీల్ధారు తనిఖీలు

ధరల నియంత్రణ దిశగా తహసీల్ధారు తనిఖీలు వింజమూరు, ఏప్రిల్ 23 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని కిరాణా దుకాణాల వద్ద గురువారం ఉదయం తహసిల్ధారు సుధాకర్ రావు విస్తృతంగా పరిశీలనలు చేశారు. వస్తువుల ధరలు గురించి ఆరా తీశారు. ఎట్టి పరిస్థితులలోనూ వస్తువులకు కృత్రిమ కొరతను సృష్టించడం గానీ, అధిక ధరలకు విక్రయించడం గానీ చేయరాదని దుకాణాదారులకు సూచించారు. లాక్ డౌన్ ప్రకటించిన గత నెల మొదటి రోజు నుండి కూడా తహసీల్ధారు సుధాకర్ రావు ప్రధానంగా నిత్యావసర వస్తువుల వస్తువుల ధరలపై దృష్టి సారించారు. అందులో భాగంగా కూరగాయలు, కిరాణా కొట్లు దుకాణాదారులతో అప్పట్లోనే సమావేశాలు నిర్వహించి దుకాణాల ముందు భాగంలో ధరల పట్టికల బోర్డులను ఏర్పాటు చేయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వస్తువులను వినియోగదారులకు విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసి ఉన్నారు. ఈ నేపధ్యంలో ప్రతిరోజూ ఉదయం తహసిల్ధారు నిత్యావసర సరుకుల దుకాణాలను పరిశీలిస్తూ కొనుగోలు దారులను ధరల విషయమై అడుగుతూ వారి స్పందనను బట్టి ముందుకు సాగుతున్నారు. ఏ మాత్రం కృత్రిమ కొరత సృష్టించినా, ధరలు పెంచినా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తూ ధరల నియంత్రణకు గట్టి చర్యలు చేపడుతున్నారు.