రాజ్యాంగ బద్దంగానే రాజ్ భవన్... అంతా చట్టపరిధికి లోబడే

రాజ్యాంగ బద్దంగానే రాజ్ భవన్...
అంతా చట్టపరిధికి లోబడే


రమేష్ కుమార్ ను తొలిగించలేదు... కేవలం స్యయంచాలిత పదవీ విరమణ మాత్రమే


            రాష్ట్ర ఎన్నికల కమీషన్ వ్యవహారాలలో తాజాగా చోటు చేసుకున్న మార్పులు రాజ్యాంగ బద్దమైనవేనా, రాష్ట్ర రాజ్యాంగ సంరక్షణ కార్యాలయంగా ఉన్న రాజ్ భవన్ ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించిందా, చట్టం ఏమి చెబుతోంది, జరిగిందేమిటి? ఇది రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరిలోనూ పలు సందేహాలు నెలకొన్నాయి.  ఈ అంశమే గత 3 రోజులుగా హాట్ టాపిక్ గా మారింది.


            రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలాన్ని 5 నుండి 3 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కె), ఎపి పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 200 లను ఉల్లంఘించారని కొందరి అభిప్రాయం. కాని వాస్తవం అది కాదు. ఇక్కడ అంతా రాజ్యాంగ పరిధికి లోబడే ప్రక్రియ కొనసాగింది. ప్రస్తుత ఎస్‌ఇసి ఎన్ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియటం, ప్రభుత్వం కొత్త ఎస్‌ఇసిని నియమించటం,  రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కె), ఎపి పంచాయతీ రాజ్ చట్టం, 1994 లోని 200 సెక్షన్ ప్రకారమే జరిగింది.


            భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కె),  AP పంచాయతీ రాజ్ చట్టం లోని సెక్షన్ 200  ఏమి చెబుతున్నాయన్నది ఒక సారి పరిశీలిద్దాం. ఆర్టికల్ 243 కె (2) ప్రకారం ప్రకారం “రాష్ట్ర శాసనసభ ద్వారా రూపుదిద్దుకున్న ఏదైనా చట్టం యొక్క నిబంధనలకు లోబడి ఎస్‌ఇసి యొక్క పదవీకాలం, సర్వీసు నిబంధనలను గవర్నర్ నిర్ణయిస్తారు. ఎస్ఇసి ను హైకోర్టు న్యాయమూర్తిగా స్దాయిలో పరిగణించవలసి ఉంటుంది. ఇతర కారణాల వల్ల తప్ప ఆయనను విధుల నుండి తొలగించలేరు. ఎస్ఇసి సర్వీసు నిబంధనలు అతని నియామకం తరువాత ఎదురయ్యే ప్రతికూలతకు భిన్నంగా ఉండవు. ఇక రెండవది ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994 లోని సెక్షన్ 200 (3) నిబంధన, దీనిని అనుసరించి  “స్థానిక సంస్థల కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ యొక్క సర్వీసు నిబంధనలు, పదవీకాలం గవర్నర్ ఆదేశాలకు లోబడి ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం నిర్ధేశించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ యొక్క సర్వీసు నిబంధనలు హైకోర్టు న్యాయమూర్తి మాదిరిగానే ఉంటాయి. తన నియామకం తరువాత అతని ప్రతికూలత అధారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ తన కార్యాలయం నుండి తొలగించబడరు. ఇవి రాజ్యాంగం, చట్టం చెబుతున్న అంశాలు.


            ఇక మొదటి సందేహం విషయానికి వస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కె), ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం లోని సెక్షన్ 200 స్పష్ట పరిచిన దానిని అనుసరించి  సర్వీసు నిబంధనలు, పదవీకాలం అనేవి రెండు భిన్నమైన అంశాలు. ఆ పదాలను గురించి స్పష్టంగా, ప్రత్యేకంగా, విడివిడిగా పేర్కొన్నాయి.  అందువల్ల ఈ రెండు విషయాలను భిన్నంగా చూడాలి. సర్వీసు నిబంధనలు, పదవీ కాలం లను ఒకే గాటన కట్టటం సరికాదు. సర్వీసు నిబంధనలలో అంతర్ భాగంగా పదవీకాలం తీసుకోకూడదు. అయితే సర్వీసు నిబంధనలు, పదవీ కాలం నిర్ణయంలో గవర్నర్ దే అంతిమ అధికారం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కె,  రాష్ట్ర పంచాయితీ రాజ్ చట్టం 1994 లోని 200 సెక్షన్, ఈ రెండింటిలోనూ స్పష్టంగా పేర్కొన్న దాని ప్రకారం కమీషనర్ నియామకం తరువాత అతని యొక్క ప్రతికూలత అధారంగా సర్వీసు నిబంధనలు మారవని చెప్పిందే తప్ప, పదవీ కాలం విషయంలో అలా ప్రకటించ లేదు. ఈ క్రమంలో గవర్నర్ కు కాని, ప్రభుత్వానికి కాని  రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు సంబంధించిన పదవీకాలం వ్యవహారంలో మార్పులు చేసే సంపూర్తి అధికారాన్ని భారత రాజ్యాంగం కల్పించింది. 


            2007లో ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలు, తదనంతరం జరిగిన న్యాయ సమీక్ష ఇదే విషయాన్ని ఉటంకిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఆ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలానికి సంబంధించి మార్పులు చేసింది. ఈ మార్పులు చెల్లవంటూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించగా అక్కడి  హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చింది. 2007 ఆగస్టు 23న డబ్యుపి 3457 (ఎంబి) 2007 కేసులో గౌరవ అలహాబాద్ (లక్నో బ్రాంచ్) హైకోర్టు శాసనసభ ఆమోదించిన చట్టం ద్వారా పదవీకాలం తగ్గింపుకు సంబంధించి దాఖలు అయిన కేసులో స్పష్టత నిచ్చింది. “రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలను పరిశీలించినప్పుడు ఎస్ఇసి పదవీకాలం అనేది సర్వీసు నిబంధలకు లోబడిన షరతు కాదని తీర్పు నిచ్చింది. భారత రాజ్యాంగంలోని అర్టికల్ 243కె కేవలం సర్వీసు నిబంధనలను మాత్రమే వర్తిస్తుందని, పదవీ కాలానికి సంబంధించిన మార్పు విషయంలో కాదని అలహాబాద్ అత్యున్నత న్యాయ స్దానం స్పష్టం చేసింది. ఎన్నికల కమీషనర్ నియామకం తరువాత  దీనిని సర్వీసు నిబంధనలకు సంబంధించిన  షరతుగా, కాకుంటే దాని ప్రత్యామ్నాయంగా తీసుకోవలసి ఉంటుంది. ఈ క్రమంలో రాజ్యాంగం కాని,  శాసనం కాని సర్వీసు నిబంధనలలో జరిగే మార్పును మాత్రమే అడ్డుకుంటుందే తప్ప, పదవీకాలంలో మార్పును కాదు. కాబట్టి ఎస్ఇసి పదవీకాలాన్ని ఆయన ప్రతికూలత అధారంగా మార్చరాదన్న వాదన ఇటు చట్ట పరిధిలోనూ, అటు రాజ్యాంగ బద్దంగానూ అంగీకారం కాదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ఈ పరిస్ధితి జాతీయ స్దాయిలో ఎంత మాత్రం కొత్తది కూడా కాదు,  ఇప్పటికే పలు రాష్ట్రాల ఉన్నత న్యాయ స్ధానాలలో ఈ తరహా అంశాలు న్యాయ సమీక్షలను ఎదుర్కున్నాయి.


ఇక రెండవ అంశం  ఎస్‌ఇసి తొలగింపుకు సంబంధించినది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె, ఎపి పంచాయతీ రాజ్ చట్టం  సెక్షన్ 200 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను సాధారణ పరిస్ధితులలో తొలిగించకూడదు. ఒక వేళ తొలిగించవలవలసి వస్తే హైకోర్టు న్యాయమూర్తి తొలిగింపుకు అనుసరించే విధి విధానాలే అమలులో ఉంటాయి. నిరూపితమైన దుర్వినియోగం లేదా అసమర్థత కారణాలను చూపుతూ  పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందిన తరువాత, రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే అతనిని తొలగించగలరని భారత రాజ్యాంగంలోని అర్టికల్ 217 (1 బి), 124 (4) స్పష్టంగా చెప్పింది.


అయితే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా వ్యవహరించిన రమేష్ కుమార్ ను తొలిగించలేదు. ఈ వ్యవహారంలో పరిస్థితి భిన్నంగా ఉంది.  ఎందుకంటే రమేష్ కుమార్ కు  స్వయంచాలిత పదవీ విరమణ లభించింది. మార్చబడిన చట్టాన్ని అనుసరించి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీ కాలం మూడు సంవత్సరాలు మాత్రమే. మరోవైపు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయి ఉండాలి. ఈ క్రమంలో రమేష్ కుమార్ మూడు సంవత్సరాల పదవీ కాలం ఇప్పటికే ముగిసింది, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలానికి సంబంధించి నూతన ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన ప్రభుత్వం తద్వారా కొన్ని సవరణలు చేసినందున రమేష్ కుమర్ తన కార్యాలయంలో కొనసాగడానికి అర్హతను కోల్పోయారు. ఈ క్రమంలో2016 ఏప్రిల్ 1న 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను నియమించబడిన  రమేష్ కుమార్, అనర్హత తలెత్తిన రోజు నుండి అంటే 2020 ఏప్రిల్ 10 నుండి పదవిలో కొనసాగే అవకాశం లేదు. తొలుత ఆర్డినెన్స్ జారీ ద్వారా పదవీకాలం 3 సంవత్సరాలకు తగ్గించబడింది, తరువాత పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది విభాగం 2020 ఏప్రిల్ 20న నెంబర్  618 (ఇ అండ్ ఆర్) జిఓను విడుదల చేసింది.  ఆ జిఓ 2020 ఏప్రిల్ 10 నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ పదవిని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. నిజానికి ఇది అత్యంత స్పష్టంగా సాగిన వ్యవహారమనే చెప్పాలి. పంచాయితీ రాజ్ చట్టం 200 సెక్షన్ ను అనుసరించి, తాజా సవరణకు ముందున్న చట్ట నిబంధన ప్రకారం 5 సంవత్సరాలు పదవీ కాలం పూర్తి చేసినట్లయితే ఆ పదవి అప్పటితో ముగిసి పోతుంది. చట్టసవరణతో అది మూడు సంవత్సరాలకు కుదించబడటం వల్ల  రమేష్ కుమార్ ను పదవి నుండి తొలిగించారన్న  ప్రశ్న తలెత్తదు. కేవలం అయనది స్వయంచాలక పదవీ విరమణ మాత్రమే. అలహాబాద్ హైకోర్టులో డబ్యుపి 3457 (ఎంబి) కేసులో అపర్మితా ప్రసాద్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యుపి నడుమ కూడా ఇదే తరహా సమస్య న్యాయ సమీక్షకు గురైంది.  ఈ కేసులో గౌరవ హైకోర్టు "ఒకసారి అనర్హత అనేది ఎదురైనప్పుడు వారు కార్యాలయం నుండి స్వయంచాలక పదవీ విరమణ పొందుతారని స్పష్టం చేసింది ”.