ప్రజల సంక్షేమం, భద్రతే ప్రభుత్వానికి ముఖ్యము -కంపెనీ కాదు.: జిల్లా ఇన్ చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు


• ప్రజల సంక్షేమం, భద్రతే ప్రభుత్వానికి ముఖ్యము -కంపెనీ కాదు.
• మొత్తం బాధితులు 585 మందికి చికిత్స జరుగుతుంది
• 418 మంది కెజిహెచ్ లో, 111 మంది డిశ్చార్జ్, 307 మందికి చికిత్స జరుగుతుంది, 167 మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో, 67 మంది డిశ్చార్జ్, 105 మందికి చికిత్స జరుగుతుంది
• దేశంలోని అత్యున్నత కమిటీలచే అధ్యయనం
• పారా మీటర్లను అధ్యయనం చేసి ప్రజలు 5 గ్రామాలకు వెల్లవచ్చని ప్రకటిస్తారు
విలేఖరుల సమావేశంలో వెల్లడించిన                                                                                   జిల్లా ఇన్ చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు
  విశాఖపట్నం,మే,9ః ఎల్.జి. పాలిమర్స్ గ్యాస్ లీకేజి పొల్యూషన్ పూర్తి స్థాయిలో అదుపులో ఉందని జిల్లా ఇన్ చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు చెప్పారు.  ఎల్.జి.పాలీమర్స్ గ్యాస్ లీకేజి పొల్యూషన్ పై ఆయన రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్థి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర రహదారులు, భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాసు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ లతో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీకేజి ప్రభావం నుండి ఆ ప్రాంతం కోలుకుంటుందని, గాలిలో కలసిన గ్యాస్ ప్రభావం తగ్గుతుందని, 8వ తేదీ రాత్రి 7 గంటలకు 17.5 పిపిఎం ఉన్నదని, ప్రస్తుతం 1.9 పిపిఎం ఉన్నదని, చాలా వేగంగా తగ్గుతుందని చెప్పారు.  స్టోరేజి పాయింట్ వద్ద చాలా వేగంగా తగ్గుతుందన్నారు. అక్కడ పెద్ద ఎత్తున నీటిని నిలువ చేయడం జరుగుతుదని,  గ్రామాల వద్ద రేపు సాయంత్రం పారా మీటర్లను అద్యయం చేసి 5 గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు వెళ్లవచ్చుని ప్రకటిస్తారని తెలిపారు. అంతర్గత కమిటీ ఉంటుందని, ఇందులో ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డైరక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుందని తెలిపారు.  ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫసర్లతో ఒక కమిటీ ఉంటుందని, ఇందులో ఎస్. బాల ప్రసాద్ అధ్యక్షతన వివిధ రంగాలలో అధ్యయనం చేస్తుందని చెప్పారు.  ఐఐఎస్ఇఆర్ అధ్యయనం చేసి సూచనలు, సాంకేతిక అంశాలపైన సలహాలు ఇస్తారన్నారు.  కేబినెట్ కార్యదర్శి ఒక కమిటీని పంపిస్తున్నారని, ఇందులో ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారని పేర్కొన్నారు.  నేషనల్ ఎన్విరాన్ మెంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (నీరి) నుండి 5 గురు సభ్యులతో కూడి బృందం వచ్చి నీటి వనరులు, తదితర వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తత చేసే సూచనలు ఇస్తుందని, ఎన్డిఆర్ఎఫ్ నుండి నాగ్ పూర్ నుండి ఒక టీం వచ్చిందని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిదేదికలను ప్రభుత్వానికి అందజేస్తారుని పేర్కొన్నారు.  మెడికల్ అండ్ హెల్త్ కమిటీ ఉంటుందని ఇందులో డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, కెజిహెచ్ పర్యవేక్షకులు ఉంటారని, వీరు గ్యాస్ లీకేజి ప్రజలపై  ఏ విధమైన ప్రభావం చూపుతుందనే విషయాలను అధ్యయనం చేస్తారని, వీరు రేపటి నుండే అధ్యయనం ప్రారంభిస్తారని చెప్పారు.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారిపై అధ్యయనం చేస్తారని తెలిపారు.  ఎల్.జి. పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటనలో 5 గ్రామాల నుండి మొత్తం 585 మంది ఆసుపత్రుల్లో చేరారని, 418 మంది కెజిహెచ్ లోను, ఇందులో 111 మందిని డిశ్చార్జి చేయడం జరిగిందని, 307 మందికి చికిత్స అందుతుందని, 167 మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతుందని, 62 మంది డిశ్చార్జి చేసినట్లు చెప్పారు.  24*7 సమయం వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు.  వైద్యానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.  సంఘటలో 12 మంది మరణించారని, పోస్టుమార్టం అనంతరం ఈ రోజు మృత దేహాలను వారి బందువులకు అప్పగించడమైనదని, ఆర్థిక సహాయంగా ఒక్కొక్కరికి కోటి రూపాయలు ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు.  లీగల్ హెయిర్ రిపోర్టు అధికారులు రేపు తెప్పిస్తారని చెప్పారు.  పరిహారం మొత్తం అందిస్తామని తెలిపారు.  ఇందుకు ప్రభుత్వం జిఓ కూడా జారీ చేయడమైనదని స్పష్టం చేశారు.  పాడి పశువుల ఎన్యూమరేషన్ పూర్తి అయిందని, ఏ ఒక్క రైతు నష్ట పోకుండా ఉండేందుకు నష్ట పరిహారం పూర్తి గా అందించడం జరుగుతుందని తెలిపారు.  విశాఖ, పరిసర ప్రాంతంలొ కెమికల్స్ ఇండస్ట్రీస్ లలో నిలువ ఉన్న రసాయనాలను కమిటీలు పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తారన్నారు.  ఎస్.ఓ.పి.ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, ఆ నిబంధనలకు అనుగుణంగానే చేయనున్నట్లు చెప్పారు.  విశాఖ ఒక సేఫ్ జోన్ ఉండే విధంగా అధ్యయనం చేస్తారని తెలిపారు.  గ్రామాల్లో పాలీమర్స్ ప్రభావం ఎంత వరకు ఉన్నదీ గ్రామాల్లో ఎక్కడెక్కడ వాటర్ ట్యాంకులు ఉన్నాయో వాటిని వాడవద్దని ఎక్స్పర్ట్స్ చెప్పినట్లు తెలిపారు. బోర్ వెల్స్ ను పరిశీలిస్తారని చెప్పారు.  మేగాద్రి గెడ్డ నీటిని జివియంసి ఇప్పటికే నిలిపివేసినట్లు చెప్పారు.  స్టైరీన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మార్గదర్శకాలను కమిటీలు సూచిస్తాయని పేర్కొన్నారు.  వివిధ కమిటీల అధ్యయనం తరువాత ఇచ్చిన నివేధికలు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, అంతవరకు కంపెనీ తెరవబడదని చెప్పారు.  
  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘటనలో బాధితులను ఆదుకోడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని, అధికార యంత్రాంగం తక్షణమే అప్రమత్త్తం గావించిందన్నారు.  క్రింది స్థాయి నుండి ఛీఫ్ సెక్రటరీ, డిజిపి స్థాయి వరకు అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని, 7 గురు మంత్రులపై బాధ్యత ఉంచారని, వారు నిరంతరం పర్యవేక్షిస్తూ అక్కడి ప్రజల క్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు.  
  రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్థి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, బధ్రత ప్రభుత్వానికి ముఖ్యమని, కంపెనీ కాదని స్పష్టం చేశారు.  దీని కోసం పూర్తి స్థాయిలో చర్యలు చేపుతున్నామన్నారు. 5 గ్రామాల ప్రజలను తిరిగి వారి ఇళ్ళకు క్షేమంగా పంపడానికి ఆలోచిస్తున్నామన్నారు.  సంఘటనపై కమిటీలను వేయించడం జరిగిందని, నివేదిక రాగానే కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.