మద్యం, ఇసుక అక్రమాలకు ఇక చెక్‌ నిరోధించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)  ఏర్పాటు: ముఖ్యమంత్రి వైస్

08–05–2020
అమరావతి


*మద్యం, ఇసుక అక్రమాలకు ఇక చెక్‌
 నిరోధించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)  ఏర్పాటు
*పూర్తి స్వతంత్రంగా పనిచేయనున్న వ్యవస్థ*
*డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ స్థానంలో కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)*
*ఇంటెలిజెన్స్, ఏసీబీ లానే స్వతంత్రంగా పనిచేయనున్న వ్యవస్థ*
*బ్యూరో కింద సరిహద్దు జిల్లాల్లో ఐపీఎస్‌ స్థాయి అధికారి, మిగిలిన చోట్ల ఏఎస్పీ స్థాయి అధికారి*
*ఎక్సైజ్‌లో అధికభాగం సిబ్బంది ఈ వ్యవస్థ కిందకు* 
*మద్యం, ఇసుక అక్రమాల నిరోధంపై ఈ ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్న సీఎం*
*3 రోజలు క్రితం ప్రత్యేక వ్యవస్థపై దిశానిర్దేశం చేసిన సీఎం*
*తుదిరూపం తీసుకురావాలని ఆదేశాలు* 
*ఇవాళ మళ్లీ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం* 
*స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)కు తుదిరూపం*


అమరావతి:
మద్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న  చర్యలతో రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా, తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు ఇసుక అక్రమరవాణాపై నిరోధంపైనా కూడా దృష్టిపెట్టింది. ఈమేరకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)  ఏర్పాటు అవుతోంది. సరిహద్దులనుంచి మద్యం అక్రమంగా రవాణా కాకుండా, అలాగే రాష్ట్రంలో సారా రూపంలో మద్యం తయారు కాకుండా, ఇసుక అక్రమాలను నిరోధించడానికి బలోపేతమైన ఈ స్వతంత్ర వ్యవస్థ రానుంది. 3 రోజుల క్రితం ఎక్సైజ్‌శాఖామంత్రి, సీఎస్, డీజీపీల సహా కీలక అధికారులు హాజరైన సమావేశంలో సీఎం ప్రత్యేక వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని, దాని రూపురేఖలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనిపై సరైన ప్రణాళికను తీసుకురావాలని ఆదేశించారు. మళ్లీ ఇవాళ అధికారులతో సమావేశం అయ్యారు. మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగుల కారణంగా పొరుగు రాష్ట్రాలనుంచి అక్రమంగా మద్యం రవాణా చేయడానికి, అదేవిధంగా అక్రమంగా మద్యాన్ని తయారు చేయడానికి అవకాశాలు ఉంటాయని సీఎం అన్నారు. 


గత ప్రభుత్వంలో మద్య నియంత్రణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లాంటి అంశాల్ని పూర్తిగా వదిలేశారని, పర్మిట్‌ రూమ్స్‌ రూపంలో, బెల్టుషాపుల రూపంలో ఎక్కడిపడితే అక్కడ మద్యాన్ని విక్రయించారని సీఎం గుర్తుచేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం దుకాణాలను తగ్గించడమే కాకుండా ధరలను కూడా పెంచామన్నారు. గ్రామాల్లో దాదాపు 43వేల బెల్టుషాపులను ఏరివేయడమే కాకుండా, 4500 పర్మిట్‌ రూంలను పూర్తిగా ఎత్తివేశామన్నారు. ఈ చర్యలతో మద్య నియంత్రణ విషయంలో కీలక అడుగులు ముందుకేశామని సీఎం అన్నారు. ఇప్పుడుకూడా మద్యం ధరలను 75శాతం పెంచడమే కాకుండా... మరో 13 శాతం దుకాణాలను తగ్గించడానికి నిర్ణయించామన్నారు. దీనివల్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 33శాతం మద్యం దుకాణాలను తొలగించినట్టు అవుతుందన్నారు. రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్దేశాలను దెబ్బతీయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యం అక్రమ రవాణాను, ఇసుక అక్రమ రవాణా జరక్కూడదని సీఎం తేల్చిచెప్పారు. ఏసీబీ, విజిలెన్స్‌ మరియు ఎన్‌ఫోర్స్‌ మెంట్, ఇంటెలిజెన్స్‌ ఎలా పనిచేస్తాయో... అదే తీరులో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌) పనిచేయాలన్నారు. మద్యం అక్రమ తయారీ, మద్యం, ఇసుక అక్రమ రవాణాలను అడ్డుకోవడమే దీనిప్రధాన విధి అని సీఎం స్పష్టంచేశారు. సీఎం ఆదేశాలతో అధికారులు స్వతంత్ర వ్యవస్థకు తుదిరూపు ఇచ్చారు. 


గతంలో ఎక్సైజ్‌ కమిషనర్‌ కింద డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ పోస్టు ఉండేది. మద్యం అక్రమ రవాణా, తయారీలను అడ్డుకోవడం దీని పని. అయితే.... గత ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహించడంతో ప్రొహిబిషన్‌ కార్యకలాపాలు పూర్తిగా మూలనపడ్డాయి. తాజా నిర్ణయం ప్రకారం ఎక్సైజ్‌ కమిషనర్‌ కింద ఉన్న డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ పోస్టు స్థానంలో స్వతంత్రంగా పనిచేసే కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌) పోస్టు వస్తుంది. ఇది డీజీపీ పర్యవేక్షణలో ఉంటుంది.


ఎక్సైజ్‌ విభాగంలో ఉన్న సిబ్బందిలో కొద్దిమంది ఎక్సైజ్‌ కమిషనర్‌ విభాగం కిందకు వస్తారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున లైసెన్స్‌లు, స్టాకు, విక్రయాలు, ప్రొడక్షన్‌ లాంటి రోజువారీ పాలనా అంశాలను మాత్రమే ఎక్సైజ్‌ కమిషనర్‌ చూసుకుంటారు. 


ఎక్సైజ్‌ విభాగంలో మిగిలిన సీఐలు, ఎస్సైలు, మిగిలిన సిబ్బంది అంతా కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)
కిందకు వస్తారు. మద్యం అక్రమ తయారీ, రవాణాలను అడ్డుకోవడం వీరి ప్రధాన విధి. అలాగే ఇసుక అక్రమాలను కూడా నిరోధించడం వీరి విధుల కిందకే వస్తుంది. 


కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)
కింద జిల్లాల్లో ఏఎస్పీలు కూడా పనిచేస్తారు. ఒక్కో ఏఎస్పీ కింద కనీసం 20 నుంచి 30 మంది సిబ్బంది ఉంటారు. జిల్లా ఎస్పీలతో వీరు సమన్వయం చేసుకుంటారు. అక్రమ రవాణాకు ఆస్కారం ఎక్కువగా ఉన్న సరిహద్దు జిల్లాల్లో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌) కోసం 
ఐపీఎస్‌ స్థాయి అధికారులు ఉంటారు. వీరంతా కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌) రిపోర్టు చేస్తారు. 


మద్యాన్ని అక్రమంగా రవాణా చేయకుండా, తయారు చేయకుండా, అలాగే ఇసుక అక్రమాలు జరక్కుండా చూడ్డమే ఈ కొత్త వ్యవస్థ బాధ్యత. వీరికి మెరుగైన మౌలిక సదుపాయాలు, వాహనాలు కల్పించి గట్టిగా పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. అప్పుడే ప్రభుత్వం అనుకున్న ఉద్దేశాలు నెరవేరుతాయని అన్నారు. 


స్వతంత్ర ప్రతిపత్తిగల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నిబంధనల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.