ర్యాంపులకు 5 కి.మీ లోపు ఉచితంగా ఇసుక విజయవాడ : ర్యాంపులకు 5 కి.మీ లోపు గ్రామాల ప్రజల అవసరాలకు ఎద్దుల బండిపై ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ఇసుక రవాణాపై మైనింగ్‌ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. నదీ పరివాహక ప్రాం తంలోని గుర్తించిన 118 గ్రామాలకు ఈ అవకాశం ఉందన్నారు. ఇసుక నిల్వ చేసినా, అమ్మినా జరిమానా విధిస్తామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతీరోజూ మూడు వేల కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. కొవిడ్‌-19 ఆసుపత్రులు, వైద్య పరీక్షల నిర్వహణపై వైద్యాధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. పాజిటివ్‌ కేసుల అడ్మిషన్‌, డిశ్చార్జ్‌ వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా పంపాలన్నారు. జేసీలు శివశంకర్‌, మోహన్‌కుమార్‌, డీఆర్వో ప్రసాద్‌ పాల్గొన్నారు. గ్రామ సచివాలయల నిర్మాణాల్లో వేగం పెంచాలని పంచాయతీ రాజ్‌శాఖ ఇంజనీర్లను కలెక్టర్‌ ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఈఈలు, డీఈలు, ఏఈలతో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయితీరాజ్‌ శాఖకు అప్పగించిన 811 గ్రామ పంచాయతీల నిర్మాణ పనులను ఆగస్టు 31 నాటికి పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని 801 రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కూడా ఈ నెలాఖరుకు ప్రారంభించాలన్నారు. జేసీ మోహన్‌కుమార్‌, జడ్పీ సీఈ వో సూర్యప్రకాష్‌, సర్వశిక్షాభియాన్‌ ఏసీపీ రవీంద్రబాబు పాల్గొన్నారు.